రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేసిన వీహెచ్

By :  Vinitha
Update: 2024-03-23 14:16 GMT

సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంత రావు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల ఇండ్లకు వెళ్లి రేవంత్ రెడ్డి తన స్థాయిని తగ్గించుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్‌ను కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించారని చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని చెప్పారు. రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆయన తన స్థాయిని తాను తగ్గించుకుంటున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

అయితే రేవంత్ రెడ్డిని తాను కలిసి ఇవన్నీ చెబుతామంటే తనకు సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హాయంలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీలో చేరుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కేడర్‌కు న్యాయం చేయకుండా మన వారిపై కేసులు పెట్టిన వారికి పెద్దపీట వేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు తాము ఎక్కడకు వెళ్లినా కేసులు పెట్టారని గుర్తు చేశారు. కేసుల వల్ల ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని..వీటిని ఎత్తివేయాలని కోరారు. రేవంత్ రెడ్డి ఒకవైపు కాకుండా రెండువైపుల వినాలని అభిప్రాయపడ్డారు. తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగవద్దనేదే తన ఉద్దేశ్యమని వీహెచ్‌ చెప్పారు.

Tags:    

Similar News