YS Sharmila: కేటీఆర్.. తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పు : షర్మిల

By :  Krishna
Update: 2023-10-19 09:41 GMT

ఓట్ల కోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమని వైఎస్ షర్మిల విమర్శించారు. నాడు పేపర్లు లీకై నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నప్పుడు టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తుందని చెప్పి.. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటున్నారంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వండని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు స్పందించలేదు కానీ.. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని బొంకుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

‘‘ టీఎస్పీఎస్సీ బోర్డు పారదర్శకంగా నడుస్తుందని ప్రకటించింది మీరే. పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదన్నది మీరే. ఇప్పుడు తప్పు జరిగిందని కమిషన్ ప్రక్షాళన అంటున్నది మీరే. ఈ డ్రామాలన్నీ ఎందుకు దొర? ఓట్ల కోసమే కదా. ఇన్ని రోజులు టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలు నిజం. మీరు పరీక్ష పేపర్లు అమ్ముకున్నారన్నదే వాస్తవం. ఏళ్ల తరబడి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ కురిపిస్తున్నారు’’ అని షర్మిల అన్నారు.

కేటీఆర్ ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ బిడ్డలకు క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. నిరుద్యోగుల బలిదానాల మీద అధికార పీఠం ఎక్కి నిరుద్యోగులనే నిండా ముంచారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ మీరు చేసిన మోసాలు ఇక చాలు అని.. నిరుద్యోగుల ఆగ్రహజ్వాలల్లోనే కేసీఆర్ ప్రభుత్వం మంట కలిసిపోతుందని ధ్వజమెత్తారు. తెలంగాణ చరిత్రలో నిరుద్యోగ ద్రోహులుగా నిలిచిపోతారని అన్నారు.

Tags:    

Similar News