Telangana elections : ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు

Byline :  Veerendra Prasad
Update: 2023-11-22 05:01 GMT

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. మూడో మారు అధికారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) .. పలు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను.. ప్రజలకు వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకత్వం చేసిన ప్రకటనలను ఎండగడుతూ పోతున్నారు. రైతుబంధు, 24 గంటల విద్యుత్, దళితబంధు, తదితరాలు ఉండాలంటే.. బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నారు. హస్తం పార్టీ గెలిస్తే అవన్నీ ఆగిపోతాయని ప్రజలని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి ఎన్నికల హామీలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా ఇతర హామీలు ఇస్తూ కేసీఆర్ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇవాళ 4 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు కేసీఆర్. ప్రచారంలో భాగంగా తాండూర్ , కొడంగల్, మహబూబ్ నగర్, పరిగిలోని ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.

ఇక, నేటి నుంచి ఈ నెల 28 వరకు కేసీఆర్.. మరో 23 బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో గులాబీ దళపతి పాల్గొనలేదు. ఈ నెల 25న సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా కేసీఆర్.. అక్టోబర్ 15 నుంచే ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ నుంచి ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఇప్పటి వరకు 74 సభల్లో ఆయన పాల్గొన్నారు.




Tags:    

Similar News