KCR : నామినేషన్‌కు డేట్ ఫిక్స్.. ముందుగానే కోనాయిపల్లికి..

Byline :  Veerendra Prasad
Update: 2023-11-03 05:54 GMT

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు సిద్ధిపేటకు వెళ్లనున్నారు. అక్కడి కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో నామినేషన్లు వేసే ముందు ప్రతిసారి కేసీఆర్‌ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. అయితే.. ఈసారి వరుస బీఆర్‌ఎస్‌ సభలు.. మధ్యలో యాగం, సమయాభావ పరిస్థితులు, పైగా రేపు శనివారం కావడంతో ఈసారి ముందుగానే ఈ ఆలయంలో పూజలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల9వ తేదీన గజ్వేల్‌తో పాటు కామారెడ్డి లోనూ కేసీఆర్‌ నామినేషన్లు వేయనున్నారు. సీఎం కేసీఆర్ మొదటి నామినేషన్ గజ్వేల్ లో వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ వేస్తారు. ఇక అదే రోజు సాయంత్రం కామారెడ్డి బీఆర్‌ఎస్‌ ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం లోని కోనాయిపల్లి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం.. కేసీఆర్‌కు సెంటిమెంట్‌ దేవాలయం. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్‌ వేస్తారు. 1985లో మొదటిసారి సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లలో జరిగిన ఎన్నికల సమయంలో.. ఈ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్‌ వేశారు. అన్ని సందర్భాల్లో ఆయన విజయం సాధించారు. మరో విశేషం ఏంటంటే.. 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్‌ఎస్‌(ప్రస్తుతం బీఆర్‌ఎస్‌) పార్టీ ప్రకటన చేశారు.




Tags:    

Similar News