KCR : ప్రతి వ్యక్తి ముఖం మీద చిరునవ్వు ఉండాలనేది మా లక్ష్యం : కేసీఆర్

Byline :  Krishna
Update: 2023-10-31 12:01 GMT

తెలంగాణలో ప్రతి వ్యక్తి ముఖం మీద చిరునవ్వు ఉండాలనేది తమ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. గత పదేళ్లుగా కడుపు కట్టుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. ఒక్కో సమస్యను అధిగమించి ముందుకు సాగుతున్నామన్నారు. తలసారి ఆదాయం, విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్కు ఓటెయ్యాలని సూచించారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలో 30వేల కోట్లతో 30వేల కోట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మిస్తునట్లు కేసీఆర్ చెప్పారు. ఈ ప్లాంట్ కోసం భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో సాగునీటి సమస్యకు చెక్ పెట్టేలా చర్యలు చేపట్టామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆసీఫ్ నగర్ కెనాల్ నుంచి ఉదయ సముద్రంలోకి.. అక్కడి నుంచి పెద్దదేవులపల్లి చెరువులోకి నీళ్లు వస్తాయని చెప్పారు. దీంతో సాగర్ ఆయకట్టు రైతులకు సాగునీట ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.

రైతు బంధుతో ప్రభుత్వ నిధులను దుబారా చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని.. రైతులకు డబ్బులు ఇస్తూ దుబారానా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇక పీసీసీ చీఫ్ అయితే 3గంటల విద్యుత్ చాలని అంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తీరుతో కర్నాటకలో రైతులు అరిగోస పడుతున్నారని.. కనీసం అక్కడ 5గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని చెప్పారు. పైగా అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 24గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణకు వచ్చి తమ రాష్ట్రంలో 5గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఏ పనిచేసిన నిజాయితీగా చేస్తారని కేసీఆర్ అన్నారు. నియోజకవర్గ సమస్యల కోసం తప్పా.. ఆయన వ్యక్తిగత సమస్యల కోసం తన దగ్గరకు ఎప్పుడూ రాలేదన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని.. ఈ సారి కూడా గెలిపిస్తే మరింత అభివృద్ధి జరగుతుందన్నారు. ప్రజలు ఓట్లేసేటప్పుడు అన్నీ ఆలోచించుకుని ఓటెయ్యాలని.. ఎన్నికల్లో ఒక వ్యక్తి కాదు ప్రజలు గెలవాలని సూచించారు.


Tags:    

Similar News