అభ్యర్థులు ఫైనల్.. వారంలో కాంగ్రెస్ లిస్ట్ - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Byline :  Kiran
Update: 2023-10-08 16:18 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాల ఎంపికే లక్ష్యంగా జరిగిన కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసింది. ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూంలో జరిగిన ఈ సమావేశంలో నేతలు అభ్యర్థుల ఎంపికపై దాదాపు 8 గంటల పాటు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. సమావేశంలో 119 స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని చెప్పారు. స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను ఫైనల్ చేసిందని, ఆ లిస్టును ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ కు పంపిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ సీఈసీ నిర్ణయం మేరకు వారంలోపు అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ సీఈసీ వీలైనంత తొందరగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే చెప్పారు. వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చిన దరఖాస్తులు వచ్చాయని.. వాటన్నింటినీ పరిశీలించినట్లు చెప్పారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశం అవుతుందని మాణిక్ రావ్ ఠాక్రే చెప్పారు.

ఇదిలా ఉంటే అభ్యర్థుల ఎంపిక సందర్భంగా కాంగ్రెస్ వార్ రూంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మరోసారి తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. సీనియర్లు పోటీ చేసే స్థానాల్లో రేవంత్ రెడ్డి మరో ఇద్దరి పేర్లు కొత్తగా చేర్చడంపై కోమటిరెడ్డితో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్న సమయంలో కొత్త పేర్లు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో టికెట్ల ఎంపిక అంశాన్ని రాహుల్ గాంధీ వద్దనే తేల్చుకుందామని ఇద్దరు నేతలు సవాల్ విసుకున్నట్లు వార్తలు వచ్చాయి.




Tags:    

Similar News