PONGULETI SRINIVAS REDDY: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు

Byline :  Veerendra Prasad
Update: 2023-11-09 02:35 GMT

తనపై ఐటీ దాడులు జరుగుతాయని ముందే ఊహించి మీడియా ముందు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. 24 గంటల్లోపే పొంగులేటి ఇల్లు, కార్యాలయంలో ఐటీ తనిఖీలు చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఖమ్మంలోని పొంగులేటి ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. 8 వాహనాల్లో ఐటీ అధికారులు వచ్చి ఈ దాడుల్లో పాల్గొన్నారు. మూకుమ్మడిగా ఇంట్లోకి ప్రవేశించి పొంగులేటితో సహా కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా . హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో పొంగులేటికి చెందిన నివాసాల్లో ఉదయం 6 గం.లనుంచే దాడులు జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డింగ్స్ లోని ఆయన నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు నేడు నామినేషన్‌ వేసేందుకు ఆయన సిద్ధమవుతున్న నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశవుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీటు ఇస్తామని ఇవ్వకపోవడంతో పొంగులేటి కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆ తరువాత ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి పాలేరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీకి దిగబోతున్నారు. గడిచిన కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకుల మీద ఐటీ దాడులు నిర్వహించడం గమనార్హం. బుధవారం మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. ఖమ్మంలోని తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన రెండు నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పొంగులేటి తన మీద కూడా ఐటీ దాడులు జరుగుతాయని అన్నారు. అలాగే జరిగింది.




Tags:    

Similar News