Komatireddy Raj Gopal Reddy: నా ఆశయం ఐదు వారాల్లో నెరవేరుతుంది.. రాజగోపాల్ రెడ్డి

Byline :  Veerendra Prasad
Update: 2023-10-25 07:00 GMT

తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీకి రాజీనామా చేశారు. తిరిగి హస్తం గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం కార్యకర్తలతో సమావేశమై కార్యాచరణ నిర్ణయించనున్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో.. తెలంగాణలో అవినీతి అరాచక నియంతృత్వ కుటుంబ పాలనకు చరమగీతం పాడే శక్తి బీజేపీకే ఉందని భావించి 15 నెలల క్రితం ... మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరానని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ నెలాఖరున మునుగోడు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమీషా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి ఆశీస్సులతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్ఎస్ ను ఓడించినంత పని చేశానన్నారు.

బీజేపీ డీలా పడింది

"ఆ ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలు మరో వంద మంది ఇతర సీనియర్ నేతలను ప్రచారంలోకి దింపి వందల కోట్లు ఖర్చు చేసి, భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ స్వల్ప తేడాతో నెగ్గి, నైతికంగా ఓడింది. మునుగోడు ఉప ఎన్నికల్లో నా విజయం కోసం ప్రయత్నించిన బీజేపీ నేతలు కార్యకర్తలు శ్రేయోభిలాషులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అవినీతిలో మునిగిన కేసీఆర్ సర్కారుపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న తెలంగాణ ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయి. అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదగలేక పోవడంతో ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చింది.

అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ..

సకల జనుల పోరాటంతో సాకారమైన ప్రత్యేక తెలంగాణ పదేళ్ల కేసీఆర్ సర్కారు అరాచక పాలనతో గాడి తప్పింది. అధికార మార్పును కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నేను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లోనే బిజెపికి రాజీనామా చేస్తున్నాను. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా నాకు నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బిజెపికి ధన్యవాదాలు. కెసిఆర్ సర్కారుపై యుద్ధం చేయాలని ప్రోత్సహించిన కేంద్ర మంత్రి అమిత్ షాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని నేను తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అదే నా ఆశయం

బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేక తీవ్రస్థాయిలో ఉందని.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు రాజగోపాల్ రెడ్డి. కెసిఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే తన ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఏడాదిన్నర క్రితం బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్రత్మామ్నాయంగా ఉందని.. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కమలం పార్టీ డీలా పడిందని ప్రకటనలో వెల్లడించారు.




Tags:    

Similar News