KTR : నీళ్లు, నిధులు, నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ న్యాయం చేసింది.. కేటీఆర్

Byline :  Veerendra Prasad
Update: 2023-11-23 07:29 GMT



Thumb:ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సర్వసాధారణం

తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ అన్నారు. పేదరికాన్ని తగ్గించిన రాష్ట్రం , జీఎస్డీపీలో అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానంపై ఆయన హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 2014కు ముందు ఎట్లుండే తెలంగాణ 2023లో ఎట్లైంది తెలంగాణ అని గణాంకాలు, ఫొటోలతో వివరించారు. ఈ 9 ఏండ్ల పాలనలో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని, తాగునీటి కోసం రూ.37 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రాజెక్టుల కోసం రూ.లక్షా 70 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఈ పథకం ద్వారా 58 లక్షల కుటుంబాలకు నీరు అందిస్తున్నామని.. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఇతర రాష్ట్రాలు కూడా మిషన్‌ భగీరథను అనుసరిస్తున్నాయని చెప్పారు. మిషన్‌ భగీరథ స్ఫూర్తితోనే కేంద్రం కూడా హర్‌ఘర్‌ జల్‌ పథకాన్ని ప్రారంభించిందన్నారు.

‘తెలంగాణలో పంటల దిగుబడి పెరింది. ధాన్యం ఉత్పత్తిలో అన్నపూర్ణగా మారింది. మిషన్‌ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను పునరుద్ధరించాం. దీంతో ప్రతి గ్రామంలో చెరువులు నిండు కుండలా కనిపిస్తున్నాయి. సాగునీరు రావడంతో సంపద సృష్టించబడింది. నీళ్లు, నిధులు, నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ న్యాయం చేసింది. మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలలను బలోపేతం చేశాం. రైతును రాజును చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. సాగుకు 24 గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. నల్లగొండలో ఫ్లోరోసిస్‌ లేకుండా చేశాం. సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాలు కల్పించాం" అని చెప్పారు కేటీఆర్.

రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయవద్దని చెప్పారు కేటీఆర్. కాళేశ్వరాన్ని నాలుగేళ్లలో పూర్తి చేశామన్నారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు అని.. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సర్వసాధారణమన్నారు. ప్రకాశం, ధవళేశ్వరం, కడెం జలాశయాల్లోనూ సమస్యలు వచ్చాయన్నారు. సాగర్‌ కట్టిన తర్వాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయని, రెండేళ్ల క్రితం శ్రీశైలం పంపులు కూడా నీట మునిగాయన్నారు.




Tags:    

Similar News