KCR : సీఎం కేసీఆర్‌‌పై పోటీకి సై అంటున్న 100 మంది రైతులు

Byline :  Veerendra Prasad
Update: 2023-11-03 03:14 GMT

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీకి 100 నామినేషన్లు వేస్తామని పౌల్ట్రీ రైతులు గురువారం వెల్లడించారు. జిల్లా కేంద్రంలో పౌల్ట్రీ రైతుల అసోసియేషన్.. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ సమ్మేళనంలో ఓన్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రావు, ఇంటిగ్రేటెడ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఐతే.. కామారెడ్డిలో ఇప్పటికే 1016 మంది కాయితీ లంబాడీలు నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. ఇప్పుడు వారికి రైతులు కూడా తోడైనట్లైంది. ఈసారి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కేసీఆర్… గజ్వేల్‌తోపాటూ.. కామారెడ్డిలోనూ పోటీకి దిగుతున్నారు. ఐతే.. కామారెడ్డిలో ఆయనకు వ్యతిరేకంగా కొందరు పావులు కదుపుతున్నారు. అందువల్ల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తిగా మారింది.

అయితే కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తానని ప్రకటించినప్పుటి నుంచి కేసీఆర్​పై పోటీకి దిగేందుకు బీజేపీ, కాంగ్రెస్​లు ఉవ్విళ్లూరుతున్నాయి. అక్కడి నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దింపి కేసీఆర్​ను ఓడించాలని అనుకుంటున్నాయి. ఇటీవలే రేవంత్ రెడ్డి.. హైకమాండ్ ఆదేశిస్తే కామారెడ్డి నుంచి తాను పోటీ చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఇలా ప్రధాన పార్టీల నుంచే కేసీఆర్​కు పోటీ ఎదురవుతోంది అనుకుంటే.. ఇప్పుడు సామాన్య రైతుల నుంచి కూడా పోటీ ఎదురవుతోంది.

గతంలో నిజామాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో పసుపు రైతులు.. బీఆర్ఎస్‌ అభ్యర్థి కవితకు వ్యతిరేకంగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కవిత ఓడిపోవడం సంచలనంగా మారింది. ఇప్పుడు కామారెడ్డి రైతులు కూడా ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములపై ఏ మేర ప్రభావం చూపుతారన్నది హాట్ టాపిక్ అయ్యింది.




Tags:    

Similar News