Rahul Gandhi : కేసీఆర్‌, కేటీఆర్‌ నడుస్తున్న రోడ్లు కాంగ్రెస్‌ వేసినవే.. రాహుల్‌ గాంధీ

Byline :  Veerendra Prasad
Update: 2023-11-17 08:36 GMT

రాబోయే తెలంగాణ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరాటమని అన్నారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. సీఎం కేసీఆర్ చెబుతున్న తెలంగాణలో 24 గంటల కరెంట్‌.. కేవలం కేసీఆర్‌ ఇంట్లోమాత్రమే వస్తుందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పినపాకలో జరిగిన జనసభలో రాహుల్‌ ప్రసంగించారు. సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఏం చేసిందని కేసీఆర్‌ అడుగుతున్నారని.. అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్‌ అని అన్నారు. బీఆర్ఎస్ రాకముందే హైదరాబాద్‌ను కాంగ్రెస్ ఐటీ కేపిటల్‌ చేసిందన్నారు. మీరు చదివిన స్కూల్‌, నడిచే రోడ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీ వేసిందేనని చెప్పారు.

పదేళ్లు తెలంగాణను దోచుకున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అంతం పలికే రోజు వచ్చిందని అన్నారు రాహుల్ గాంధీ. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో తానే స్వయంగా వెళ్లి చూశానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లను దోచుకున్నారని మండిపడ్డారు. 20 లక్షల మంది రైతులను ధరణి పేరుతో మోసం చేశారని ఆరోపించారు. ధరణితో మోసపోయిన రైతులకు వారి భూములను వారికి ఇప్పిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ తుపాన్‌ మొదలైందని, ఆ తుపాన్‌లో కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోతుందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. రాష్ట్రంలో కులగణనను జరిపిస్తామన్నారు. స్థానిక సంస్థల్లోనూ బీసీల రిజర్వేషన్లు పెంచుతాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ 500 కే ఇవ్వబోతున్నామని, ప్రతి నెల మహిళల అకౌంట్లో నెలకు 2.500 వేస్తామని అన్నారు. 'కాంగ్రెస్‌ అంటే కుటుంబ పాలన కాదు ప్రజా ప్రభుత్వం. తెలంగాణ ఒక కుటుంబం కోసం ఏర్పడలేదు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం.. మూడు పార్టీలు ఒక్కటే. ఎక్కడ కాంగ్రెస్‌, బీజేపీ పోటీ ఉంటుందో అక్కడ కాంగ్రెస్‌ ఓట్లను చీల్చడానికి ఎంఐఎం ఉంటుంది. ఇక్కడ కేసీఆర్‌, కేంద్రంలో మోదీని అధికారంలో నుంచి దించేస్తాం’ అని పినపాక సభలో రాహుల్‌ వ్యాఖ్యానించారు.




Tags:    

Similar News