Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ బిజీ బిజీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ..!

Byline :  Krishna
Update: 2023-12-06 03:29 GMT

రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో నిన్న సాయంత్రం హుటాహుటిని ఢిల్లీ వెళ్లారు. నిన్న రాత్రి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఎంపీ మాణిక్కం ఠాగూర్తో ఆయన సమావేశమయ్యారు. ఇవాళ సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో ఆయన భేటీ కానున్నారు. కేబినెట్ కూర్పుపై వారితో చర్చించనున్నారు. ఎవరెవరినీ మంత్రివర్గంలోకి తీసుకోవాలి.. ఎవరికి ఏ శాఖ కట్టబెట్టాలనే దానిపై చర్చించనున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో మంత్రివర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అదేవిధంగా తన ప్రమాణస్వీకారానికి రావాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేలను రేవంత్ ఆహ్వానించనున్నారు. రేపు సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో గురువారం ఉదయం 10.28 గంటలకు గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీనికి సంబంధించి అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన విషెస్ చెబుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బాలకృష్ణ, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, బండ్ల గణేష్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు విషెస్ చెప్పారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.


Tags:    

Similar News