సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Byline :  Kiran
Update: 2023-10-07 10:06 GMT

స్కూల్ పిల్లల్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే స్థితికి సీఎం కేసీఆర్ దిగజారారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలపై ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. మిడ్ డే మీల్ పథకం సవాలక్ష సమస్యలతో అభాసుపాలవుతుంటే ఇవేమీ పట్టించుకోకుండా సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం పేరుతో హడావిడి చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచకుండా వంట కార్మికులపై మరింత భారం మోపుతున్నారని విమర్శించారు.

మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేసిన ప్రభుత్వం.. వంట కార్మికులకు ఆర్థిక భారంతో పాటు పనిభారం పెంచారని రేవంత్ ఫైర్ అయ్యారు. చాలా పాఠశాలల్లో వంట గదులేలేవని, చెట్లకింద వంటలు కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొందని అన్నారు. ఫలితంగా అక్కడక్కడా మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురైన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు గత కొన్నాళ్లుగా ఆందోలన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదని అన్నారు.

వంట కార్మికులకు జీవో 8 ప్రకారం పెరిగిన వేతనాలను బకాయిలతో సహా చెల్లించాలని రేవంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వాహణ అధ్వానంగా ఉన్నా ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకంలోని సమస్యలతో పాటు కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.




Tags:    

Similar News