Rajnath Singh : తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కడివల్లే రాలేదు.. బీజేపీ కూడా పోరాడింది: రాజ్ నాథ్ సింగ్

Byline :  Bharath
Update: 2023-10-16 10:08 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో జమ్మికుంటలో భాజపా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే ఉద్యమించలేదని, తెలంగాణ సమాజం, బీజేపీ పార్టీ కూడా పోరాడిందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాణి రుద్రమదేవి, కుమ్రం భీమ్ వంటి ఎంవరో వీరులను కన్న గడ్డ తెలంగాణ అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రేవేట్ లిమిటెడ్ గా మారిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుందని.. కల్వకుంట్ల కుటుంబ అవినీతి ఢిల్లీ వరకు చేరిందని విమర్శలు గుప్పించారు.

రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి తెలంగాణలో అన్నీ ఉన్నా.. కేసీఆర్ అభివృద్ధి చేయలేకపోయాడని మండిపడ్డారు. 1984లో బీజేపీ రెండు ఎంపీ స్థానాల్లో గెలిచి.. దేశ రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో బీజేపీ గెలిచిన రెండు సీట్లలో ఒకటి తెలంగాణ నుంచి జంగారెడ్డిదేనని గుర్తుచేశారు. గుజరాత్‌లో బీజేపీ పార్టీ రెండున్నర దశాబ్దాలుగా అధికారంలో ఉందని, అందుకే ఆ రాష్ట్రం అభివృద్ధికి రోల్ మోడల్‌గా నిలిచిందని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో.. దేశం అభివృద్ధిలో దూసుకు పోతుందని చెప్పారు. పదేళ్లుగా అధికారంలో ఉన్నా.. తెలంగాణ రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలని కేసీఆర్ ను నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైందని విమర్శించారు.




Tags:    

Similar News