ప్రజలకు హెచ్చరిక..తీవ్ర తుపానుగా బిపోర్ జాయ్..ఆ 3 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

Update: 2023-06-11 02:02 GMT

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్ జాయ్ తుపాను రానున్న 12 గంటల్లో మరింత బలపడుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర -ఈశాన్య -తూర్పు దిశగా పయనిస్తుందని తెలిపింది. తుపాను ప్రభావం కర్ణాటక, గోవా, మహారాష్ట్రాల్లో అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ఉరుములు, పిడుగులతో పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.


ప్రస్తుతం గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో బిపోర్ జాయ్ తుపాను కేంద్రీకృతమై ఉంది. పోర్‌బందర్‌కు సుమారు 200-300 కి.మి.ల దూరం నుంచి తుపాను వెళ్లిపోతుంది. తుపాను ప్రభావం గుజరాత్‎పై పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే రానున్న 5 రోజుల్లో మాత్రం రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వచ్చే 5 రోజులూ అరేబియా సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తుపాను ప్రభావం కర్ణాటక, గోవా, మహారాష్ట్రలోని తీర ప్రాంతాలపై అధికంగా ఉంటుందని చెబుతోంది. తీరప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బలమైన ఈదురు గాలులూ వీస్తాయని ప్రకటించింది. భారీ అలలు ఏర్పడే అవకాశం ఉండటంతో గుజరాత్‌లోని తితాల్‌ బీచ్‌ను జూన్ 14 వరకూ మూసివేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. పోర్‌బందర్‌, గిర్‌, సోమనాథ్‌, వల్సాద్‌లకు జాతీయ విపత్తు దళ బృందాలు చేరుకున్నాయి. అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి. 

Tags:    

Similar News