మరో ఐదు రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Update: 2023-07-20 12:49 GMT

తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఓ వైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్టంలో మరో ఐదు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని చెప్పింది. గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని అధికారులు ప్రకటించారు.

జులై 21 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు పడే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, హైదరాబాద్ లకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్‌ జారీ చేశారు. ఆదిలాబాద్‌, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.




Tags:    

Similar News