Karpoori Thakur : బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న పురస్కారం

Byline :  Vijay Kumar
Update: 2024-01-23 15:19 GMT

బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న వరించింది. మరణానంతరం ఆయనకు ఈ పురస్కారం అందనుంది. జన నాయక్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన రెండుసార్లు బీహార్ సీఎంగా పని చేశారు. కర్పూరీ ఠాకూర్ శతజయంతి సందర్భంగా ఆయనకు కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. 1924 జనవరి 24న జన్మించిన కర్పూరీ కర్పూరీ ఠాకూర్ టీచర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1952లో తాజ్‌పూర్ నియోజకవర్గం నుంచి సోషలిస్ట్ పార్టీ తరఫున విధాన సభకు ఎన్నికయ్యారు. ఉద్యోగులు, కార్మికుల తరఫున ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. బీహార్‌లో తొలి కాంగ్రెసేతర సీఎంగా కర్పూరీ ఠాకూర్ రికార్డులకెక్కారు. సోషలిస్ట్ పార్టీ తొలి సీఎం కూడా ఆయనే కావడం విశేషం. 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు సోషలిస్ట్ పార్టీ/భారతీయ క్రాంతి దళ్ తరఫున ఆయన సీఎంగా పని చేశారు. మళ్లీ 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు జనతా పార్టీ తరఫున ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

కర్పూరీ ఠాకూర్ సీఎంగా ఉన్న సమయంలో బిహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు. ఆయన హయాంలో బీహార్ లో అనేక స్కూళ్లు, కాలేజీలను స్థాపించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఆయన పేదల పాలిట పెన్నిధిగా గుర్తింపు పొందారు. 1988 ఫిబ్రవరి 17న 64 ఏళ్ల వయసులో కర్పూరీ ఠాకూర్ కన్నుమూశారు. ఇక కర్పూరీ ఠాకూర్ భారతరత్న రావడం పట్ల ప్రధాని మోడీ స్పందించారు. గొప్ప విజన్ ఉన్న నాయకుడు, అట్టడుగు వర్గాల ఛాంపియన్, జన్ నాయక్ అని అందరూ పిలుచుకునే కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అదీ ఆయన వందో జయంతి రోజును రావడం ఇంకా సంతోషంగా ఉందని అన్నారు.




Tags:    

Similar News