రేపు సెలవు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం

Byline :  Vijay Kumar
Update: 2024-01-21 08:56 GMT

రేపు (జనవరి 22) అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. ఇక ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో అనేక రాష్ట్రాలు జనవరి 22ను సెలవు దినంగా ప్రకటించాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సంస్థలన్నింటికీ రేపు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా సెలవు వర్తిస్తుందని తెలిపారు. అయోధ్య వేడుకల్లో ఉద్యోగులు పాల్గొనడానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో సెలవు ప్రకటించినట్లు తెలిపారు.

కాగా ఇప్పటివరకు బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎన్డీఏ కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే జనవరి 22న సెలవు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో ఒక్క హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే సెలవు ఇచ్చారు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో జనవరి 22న సెలవు ప్రకటించలేదు. అయోధ్య రామ మందిర కార్యక్రమం పూర్తిగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమమని, దానికి తాము హాజరు కావడం లేదంటూ కాంగ్రెస్ అగ్రనేతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో సెలవు ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. ఇక కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రేపు సెలవు ప్రకటించే ఛాన్స్ ఉందని, ఏ క్షణంలోనైనా అందుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Tags:    

Similar News