అందుకే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని చెప్పా.. AICC Mallikarjun Kharge

Byline :  Vijay Kumar
Update: 2024-02-16 09:49 GMT

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు ఎన్నికల కోసం స్ట్రాటజీలు రచిస్తున్నాయి. ఓ వైపు ఇలా ఎన్నికల హడావుడి నెలకొన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. అయితే పార్టీ నుంచి తీవ్ర నిరసన రావడంతో బ్యాంక్ అకౌంట్లను పునరుద్ధరించారు. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ మల్లికార్జును ఖర్గే, ట్రెజరర్ అజయ్ మాకెన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇది ప్రజాస్వామిక ప్రక్రయకు తీవ్రం విఘాతం కలిగించే దెబ్బ అని అన్నారు. తమ పార్టీకి చెందిన మెయిన్ అకౌంట్లతో పాటు యూత్ కాంగ్రెస్ అకౌంట్లను కూడా ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిందని అన్నారు. అయితే తాము ఢిల్లీలోని ఇన్ కం ట్యాక్స్ అప్పిల్లేట్ ట్రిబ్యునల్ కు అప్పీల్ చేయడంతో ఖాతాలను పునురుద్ధరించారని తెలిపారు. వచ్చే వారం తుది విచారణ ఉన్నందున వాటి జోలికి పోవద్దని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసిందని అన్నారు.

తమ సిబ్బందికి జీతాలు, విద్యుత్ బిల్లులు కట్టడానికి తమ వద్ద ఒక్క రూపాయి కూడా లేదని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ్ యాత్రకు కూడా దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. తాము జారీ చేసిన చెక్కులను బ్యాంకులు అంగీకరించడం లేదని అన్నారు. కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ తో పాటు క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బు కూడా నిలిచిపోయిందని అన్నారు. బీజేపీ సేకరించిన నిధులనేమో వాడుకోనిస్తారు, కానీ తమ పార్టీ నిధులను మాత్రం ఫ్రీజ్ చేస్తారని అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇక భవిష్యత్తులో ఎన్నికలు ఉండవన్నానని అన్నారు. బహుళ పార్టీ వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాలని వారు కోరారు.

Tags:    

Similar News