జనవరి 22న సెలవు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్

Byline :  Vijay Kumar
Update: 2024-01-20 13:38 GMT

అయోధ్యలో ఈ నెల 22న శ్రీ రాముడి ప్రతిష్ఠాపన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని స్కూళ్లకు ఎల్లుండి సెలవు ఇవ్వాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. న్యాయవాది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఎల్లుండి పాఠశాలలకు సెలవు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ఆయన హైకోర్టును కోరారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆ రోజున సెలవు దినంగా ప్రకటించాయని, కేంద్ర ప్రభుత్వం కూడా హాఫ్ డే హాలిడే ప్రకటించిందని న్యాయవాది శ్రీనివాస్ తన పిటిషన్ లో తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కూడా స్కూళ్లకు సెలవు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

కాగా ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం ఎల్లుండి ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ వేడుకలకు రావాల్సిందిగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, వ్యాపారస్తుతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులకు శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర్ ట్రస్టు ఆహ్వానాలు పంపింది. ఈ క్రమంలోనే యూపీ ప్రభుత్వం ప్రారంభ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రముఖులు హాజరౌతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

Tags:    

Similar News