6 గ్యారెంటీల అమలు గురించి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదు - ఈటల రాజేందర్

Update: 2024-02-10 13:59 GMT

బీఆర్ఎస్ గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లాగే నేడు కాంగ్రెస్ బడ్జెట్ ఉందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై ఈటల విమర్శలు చేశారు. అంచనాలు, ఖర్చుకు సంబంధం లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ లు ప్రవేశపెట్టిందని గతంలో విమర్శలు చేసిన కాంగ్రెస్ నేడు అధికారంలోకి వచ్చాక అదే తప్పు చేసిందని అన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒరవడిలోనే కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ ఉందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం .. 2022-23 బడ్జెట్ లో రూ. 2,56,958.51 కోట్లు ప్రతిపాదిస్తే.. రివైస్డ్ బడ్జెట్ రూ.2 లక్షల 30 వేల కోట్లుగా అంచనా వేశారని అన్నారు. ఖర్చు చేసింది రూ.2లక్షల 4 వేల 500 కోట్లు మాత్రమేనని అన్నారు. 2022-23 బడ్జెట్ 1/5వ వంతు రియాల్టీకి దూరంగా ఉందని అన్నారు. 66 వేల కోట్ల రూపాయలు ఆదాయం రాదని ఖర్చుపెట్టబోమని చూపించారన్న ఈటల.. అంటే అంకెలు తప్ప ఆచరణలో ఖర్చు ఉండదని చెప్పడమే కదా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2,75,891 కోట్లలో 40 వేల కోట్లకు పై చిలుకు ఖర్చు పెట్టే ఆస్కారం ఎంతమాత్రం లేదని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే రూ.5 లక్షల కోట్లు ఖర్చు పెడితేనే హామీలు అమలయ్యేలా కనపడుతున్నాయని అన్నారు.

బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు మాత్రమే కేటాయించారని, రైతుబంధు (భరోసా) కోసం రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చిందని అన్నారు. అలాగే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పిందని అన్నారు. ఇవన్నీ అమలు చేయాలంటే రూ.34 వేల కోట్లు ఈ సంవత్సరం ఉంటుందా లేదా అనేది స్పష్టత ఇవ్వలేదని అన్నారు. దీన్ని బట్టి చూస్తే రైతులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు ఉత్తదేనని అనిపిస్తోందని అన్నారు. రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు రూ.2500 ఆర్థిక సాయం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందన్న ఈటల.. వితంతువులకు, ఒంటరి మహిళలకు రూ.4 వేల చొప్పున ప్రతినెలా ఇవ్వాల్సి ఉందని అన్నారు. అయితే బడ్జెట్ లో మాత్రం ఎక్కడా నిధులు కేటాయించలేదని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ప్రతి నిరుద్యోగికి రూ. 4 వేలు ఇస్తామనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో ప్రస్తావించలేదని తెలిపారు. కాంగ్రెస్ బడ్జెట్ చూస్తే ప్రజలు నవ్వుకునేలా ఉంది తప్పితే వారి ఆశలు నెరవేర్చే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 66 అంశాలు ప్రస్తావించారని, రాష్ట్రంలో 52 శాతం ఉన్న బీసీ ప్రజానీకానికి ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లకు గాను లక్షకోట్ల రూపాయలు ఖర్చు పెడతామని కాంగ్రెస్ చెప్పిందని అన్నారు. అయితే బడ్జెట్ లో కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు.

బడ్జెట్ ను చూస్తే బీసీల అభ్యున్నతి కోసం రూపాయి ఖర్చు పెట్టే ఆస్కారం లేదని అన్నారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో బడ్జెట్ లో 15 శాతం మేర ఖర్చు పెడుతున్నారని చెప్పారని, కానీ విద్యా రంగానికి పెట్టే ఖర్చులో కేవలం ఉద్యోగులకు జీతభత్యాలకు మాత్రమే నిధులు సరిపోతుందని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో కాంగ్రెస్ మట్టి కొట్టిందని అన్నారు. ఆటో డ్రైవర్లు ఆదాయం రాక వేదనతో ఆటోలకు నిప్పంటించుకున్న ఘటనలు చూశామని అన్నారు. ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్ సంక్షేమం కోసం రూ.12 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని కానీ బడ్జెట్ లో కేటాయింపులు మాత్రం లేవని అన్నారు. రాష్ట్రంలోని బెల్ట్ షాపులను రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిందని, కానీ దానిపై స్పష్టత ఇవ్వడం లేదని అన్నారు. మహిళా గ్రూపులకు రూ.10 లక్షల చొప్పున పావలా వడ్డీ రుణాలు అందిస్తామని చెప్పిన కాంగ్రెస్.. బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని అన్నారు. దళితబంధు, దళిత సబ్ ప్లాన్ అమలుకు బడ్జెట్ లో కేటాయింపులు లేవని,

దళితులకు రూ. 10 లక్షలు ఇస్తారా.. లేక బంద్ చేస్తున్నారా అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ తో పాటు మిగతా నియోజకవర్గాల్లో దళితబంధుకు నోచుకోని కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొల్ల కురుమలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయంపై స్పష్టత కనపడటం లేదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని, లేదంటే ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇక పీవీకి భారతరత్న రావడం తెలుగు ప్రజలకు దక్కిన గౌరవం అని అన్న ఈటల.. కానీ కాంగ్రెస్ పార్టీ పీవీని అవమానాలకు గురి చేసిందని ఆరోపించారు. 

Tags:    

Similar News