ఆర్ఎస్ ప్రవీణ్ లేఖకు సీఎం రేవంత్ రిప్లై.. ఏమన్నారంటే?

Byline :  Vijay Kumar
Update: 2024-02-24 16:18 GMT

గురుకుల టీచర్లు, లెక్చరర్ల రిక్రూట్ మెంట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ కు లేఖ రాయగా.. తాజాగా సీఎం ఆయన లేఖకు బదులిచ్చారు. రాష్ట్ర యువతకు సంబంధించిన సమస్యని ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే మీ ప్రయత్నానికి ధన్యవాదాలు అంటూ రేవంత్ ఎక్స్ వేదికగా స్పందించారు.

ఆర్ఎస్పీకి సీఎం రేవంత్ రాసిన పూర్తి లేఖ ఇదే..

"డియర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారూ, మన తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యని ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే మీ ప్రయత్నానికి నా ధన్యవాదాలు. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఎంత దగాపడిందో, వారి భవిష్యత్తు మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బ తీసిందో మనందరం చూసాం. ఆ దశాబ్ద కాల విషాదాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, మన యువత భవితను పునర్నిర్మించాలనే సంకల్పంతో మా ప్రభుత్వం నిర్విరామంగా పని చేస్తోంది. గురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి మీరు లేవనెత్తిన విషయాలను, ఇచ్చిన సూచనలను నిశితంగా పరిశీలించి, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తాం. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణానికై ఎవరు కలిసి వచ్చినా వారి విలువైన సూచనలు, సహకారం తీసుకోవడానికి, వారితో కలిసి పనిచేయడానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

మా ప్రయత్నం.. మా తాపత్రయం అంతా తెలంగాణ ప్రజల మంచి కోసమే తప్ప.. గుర్తింపు కోసం కాదని మీకు సవినయంగా మనవి చేస్తూ.. మీరు మున్ముందు కూడా ప్రజా సమస్యలేమైనా సరే మా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను" అంటూ సీఎం రేవంత్ రెడ్డి బీఎస్పీ నేత ఆర్ఎస్పీకి బదులిచ్చారు.




Tags:    

Similar News