రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిది.. సీఎం రేవంత్

Update: 2024-02-10 12:23 GMT

తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఎస్ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు వద్ద కొత్త బస్సులను సీఎం రేవంత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సకల జనుల సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణాను స్తంభింపజేసి ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర సాధన పోరాటానికి సహకరించారని అన్నారు. తెలంగాణ వస్తే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయని కార్మికులు భావించారని, కానీ 90రోజులు సమ్మె చేసినా ఆనాటి ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని అన్నారు.

36 మంది కార్మికులు మరణించినా వారి కుటుంబాల గురించి ఆనాటి ప్రభుత్వం ఆలోచించలేదని మండిపడ్డారు. పైగా కార్మిక సంఘాలు రద్దు చేశారే తప్ప సమస్యలు పరిష్కరించలేదని అన్నారు. ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో కూడా ఆర్టీసీ కార్మికులు ముఖ్య పాత్ర పోషించారని, ఆరు గ్యారంటీలలో మొట్టమొదటి హామీని అమలు చేసిన ఘనత ఆర్టీసీ కార్మికులదని సీఎం అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకం ఆర్టీసీ బలోపేతానికి ఉపయోగపడిందని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి బడ్జెట్ ఇవాళ ప్రవేశ పెట్టామన్న సీఎం.. రూ.2,75,891 కోట్ల వాస్తవిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టామని తెలిపారు. వాస్తవాల ప్రాతిపదికన బడ్జెట్ ను రూపొందించామని, గత ప్రభుత్వంలా కాగితాల్లో చూపించి అబద్దాలు చెప్పదలచుకోలేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవిక బడ్జెట్ ను అర్ధం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా ఆర్టీసీకి రూ.281 కోట్ల నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా పాలన చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించామన్నారు. తెలంగాణ మోడల్ పాలన దేశానికి ఆదర్శకంగా మారుతుందన్నారు.

Tags:    

Similar News