తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష : హరీశ్ రావు

Byline :  Vijay Kumar
Update: 2024-01-02 11:09 GMT

తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కృతజ్ఞత సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ ప్రజల బాగోగులు పట్టవని అన్నారు. ఆ రెండు పార్టీలకు ఓట్లు, సీట్లు మాత్రమే కావాలని అన్నారు. కేంద్రంలో అధికారం గురించి మాత్రమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆలోచిస్తాయని అన్నారు. విభజన చట్టంలోని హామీలను పదేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజేపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అన్నారు. రాష్ట్రం నుంచి కనీసం 15 సీట్లను బీఆర్ఎస్ గెలిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా పనులు చేసుకోవచ్చని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎంపీ ఎన్నికల్లోపు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, ఒకవేళ చేయకుంటే లోక్ సభ ఎన్నికల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలలోపు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.4 వేల పెన్షన్ , పెంచిన రైతు బంధు ఇవ్వాలని లేకుంటే మాట తప్పినందుకు ఎన్నికల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సైనికుల్లా పని చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News