ఒకటో తేదీన వేతనాలంటూ కాంగ్రెస్ మోసం చేసింది.. Harish Rao

Byline :  Vijay Kumar
Update: 2024-02-28 13:32 GMT

ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉద్యోగులను మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం మాట తప్పిందని మండిపడ్డారు. గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి 10,632 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇంతవరకు వేతనాలు చెల్లించలేదని అన్నారు. అలాగే జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 12,660 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు అందలేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలల నుండి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.

మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంట ఛార్జీలు, కోడిగుడ్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, దీంతో మధ్యాహ్నం వంట కార్మికులు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒకటో తారీఖు రోజునే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాయని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మరి వీళ్లంతా ఉద్యోగులు కాదా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదని అన్నారు. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News