జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ

Update: 2023-12-21 16:28 GMT

హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు విజయం అందించడంలో కీలక పాత్ర వహించిన భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లకు, పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో భారత రాష్ట్ర సమితి పటిష్టంగా ఉన్నదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగిరేసేందుకు అందరము కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాల నుంచి నిరాశ పడకుండా ప్రజల తరఫున ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చేలా బాధ్యతాయుతమైన ప్రతిపక్షపాత్రను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు.

ఇందులో భాగంగా హైదరాబాద్ లోనూ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని, అయితే హామీలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నగర అభివృద్ధి కోసం ఎప్పటిలానే నిరంతరంగా కృషి చేస్తుందని కేటీఆర్ తెలిపారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే పనిచేసే పార్టీ బీఆర్ఎస్ అని ఆయన అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులంతా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.


Tags:    

Similar News