జీవో నెం.317పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Byline :  Vijay Kumar
Update: 2024-02-24 16:00 GMT

ఉద్యోగుల సర్దుబాటు కోసం 2021లో తీసుకొచ్చిన జీవో నెం.317పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జీవోపై ఉద్యోగుల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణలో 2016లో అప్పటి ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాలతో పాటే కొత్త జోన్లు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో, కొత్త జిల్లాలు, కొత్త జోన్లకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం 2021లో జీవో నెం.317 తీసుకువచ్చారు. ఆ సమయంలో ఉద్యోగులు జీవోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమ స్థానికతను కోల్పోయే విధంగా జీవో నెం.317 ఉందని ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో ఉద్యమించాయి. ఈక్రమంలోనే నాడు విపక్షంలో ఉన్నఉద్యోగులకు మద్దతు పలికి పోరుబాట పట్టింది. ఈక్రమంలోనే తాము అధికారంలోకి రాగానే ఈ జీవోపై దృష్టి సారిస్తామని కాంగ్రెస్ నేతలు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెం.317పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మంత్రి రాజనర్సింహ చైర్మన్ గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా కేబినేట్ సబ్ కమిటీని వేశారు. ఈ జీవోలో పేర్కొన్న అంశాలు, ఉద్యోగుల అభ్యంతరాలు, వివాదాలను ఈ సబ్ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసులతో కూడిన నివేదిక అందించనుంది. ఇక జీవో నెంబర్ 317పై కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.




Tags:    

Similar News