తెలంగాణలో 6 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు!

Byline :  Vijay Kumar
Update: 2024-02-25 11:13 GMT

వచ్చే నెల రెండో వారంలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. తాజాగా తెలంగాణలో 6 స్థానాలకు గాను బీజేపీ మొదటి జాబితాను రిలీజ్ చేసింది. సికింద్రాబాద్‌ నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్‌ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్‌ కుమార్, నిజామాబాద్‌ నుంచి మరో సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లను ప్రకటించింది. ఇక చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్, ఖమ్మం స్థానం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావులను ఎంపిక చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎంపీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ఇప్పటికే మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎం రేవంత్ ప్రకటించగా.. నాగర్ కర్నూల్ నుంచి తాను ఎంపీగా పోటీ చేయనున్నట్లు మల్లు రవి ప్రకటించారు. ఈ క్రమంలోనే తాను ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి పోస్టుకు రాజీనామా చేసినట్లు శనివారం ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ కూడా ఎంపీ అభ్యర్థులపై సెలక్షన్ పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది.



Tags:    

Similar News